రేపు నర్సీపట్నంలో రాష్ట్రస్థాయి వర్క్షాప్
* గ్రామీణ సంఘాల బలోపేతానికి విశాఖ గ్రామీణ సేవా సంఘాల సమాఖ్య కృషి
* యువజన, మహిళా సంఘాలకు మార్గనిర్దేశం చేయనున్న నిపుణులు
* నెట్వర్క్ కార్యదర్శి జి.టి.వి.ఎస్.ఆర్.కె. రాజు వెల్లడి*
నర్సీపట్నం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న యువజన, మహిళా సంఘాలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో ఆదివారం (మే 17న) నర్సీపట్నంలో ఒక రోజు రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించనున్నట్లు నెట్వర్క్ కార్యదర్శి జి.టి.వి.ఎస్.ఆర్.కె. రాజు తెలిపారు. విశాఖ గ్రామీణ సేవా సంఘాల సమాఖ్య, భారత్ ఎన్జీఓ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నర్సీపట్నం రోటరీ క్లబ్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరగనుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో పనిచేస్తున్న అనేక స్వచ్ఛంద సంస్థలు, మహిళా, యువజన సంఘాలు సరైన మార్గదర్శకత్వం లేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ద్వారా అందుబాటులో ఉన్న నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పించడమే ఈ వర్క్షాప్ ప్రధాన ఉద్దేశమని వివరించారు.
నిపుణులతో ప్రత్యేక శిక్షణ అవగాహన
సంఘాల నిర్వహణలో పారదర్శకత, సమర్థత పెంపొందించేందుకు అవసరమైన పలు కీలక అంశాలపై ఈ వర్క్షాప్లో నిపుణులు వివరణాత్మకంగా చర్చించనున్నట్లు రాజు తెలిపారు. సొసైటీ డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ విధానాలు వార్షిక నివేదికల తయారీ, ఖాతాల నిర్వహణ ఫండ్స్ సమీకరణ పద్ధతులు ప్రాజెక్ట్ ప్రతిపాదనల తయారీ
సంఘాల్లో చురుకుగా పనిచేసే సభ్యులను ఎగ్జిక్యూటివ్ బాడీలోకి తీసుకోవడం
గ్రామస్థాయి నాయకత్వాన్ని ప్రోత్సహించడం, సలహాదారుల కమిటీల ఏర్పాటు
ముఖ్య అతిథిగా భారత్ ఎన్జీఓ ఎండీ ఎస్. యువరాజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రస్థాయి భారత్ ఎన్జీఓ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.యువరాజు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్వచ్ఛంద సంస్థల అభివృద్ధి, నిధుల సమీకరణ, గ్రామీణ సేవా కార్యక్రమాల విస్తరణపై ఆయన ప్రతినిధులకు విలువైన సూచనలు, సలహాలు అందించనున్నారు.
ఆరు జిల్లాల ప్రతినిధుల హాజరు
ఈ వర్క్షాప్లో నెట్వర్క్ ఫౌండర్ సి.హెచ్.వి.ఎస్.ఆర్. ప్రసాద్, ప్రెసిడెంట్ ఎస్. నూకరాజు పాల్గొననున్నారు. అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వివిధ యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంఘాలకు ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి సంఘ ప్రతినిధి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జి.టి.వి.ఎస్.ఆర్.కె. రాజు పిలుపునిచ్చారు.