దివ్య దర్శిని న్యూస్ అల్లూరి జిల్లా/పాడేరు, ఫిబ్రవరి 07:
ప్రభుత్వ పథకాలు,సేవలపై క్షేత్రస్థాయిలో ప్రజల నుండి వస్తున్న ప్రతికూల స్పందనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నిర్వహించిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ కాల్స్ ద్వారా సేకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు.
ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.
ఐవిఆర్ఎస్ కాల్స్ పర్యవేక్షణ కోసం కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. దీనికి నోడల్ ఆఫీసర్లుగా డీఆర్ఓ అంబేద్కర్ ఆర్డీవో ఎం వి ఎస్ లోకేశ్వరరావు నియమించడం జరిగింది.
సచివాలయాలు, హాస్పిటల్ సేవలు, సివిల్ సప్లైస్, రెవెన్యూ ముఖ్యంగా పట్టాదార్ పాస్ పుస్తకాలు, మ్యుటేషన్లు, వంటి విభాగాల్లో ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో తేలింది. తక్కువ రేటింగ్ వచ్చిన శాఖల క్షేత్రస్థాయి సిబ్బందిపై, పర్యవేక్షణలో విఫలమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
రాబోయే కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఐ.సి.డి.ఎస్, నీటి పారుదల శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ మరియు ఆర్.టి.సి సేవలపై వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించనున్నారు.
ఫీడ్బ్యాక్ మెరుగుపడని పక్షంలో శాఖాపరమైన విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యం కేవలం పథకాలను అమలు చేయడం మాత్రమే కాదని, అవి ప్రజలకు సంతృప్తికరంగా అందుతున్నాయో లేదో చూడటమే ప్రధానమని ఈ సందర్భంగా అధికారులు గుర్తుచేశారు.
నిరంతరం నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తున్న ప్రాంతాల్లోని ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే వెనకాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధింత నోడల్ అధికారులకు ఆదేశించారు. ప్రజలకు అందే సేవల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.