ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన గంటా
విశాఖపట్నం, మే 15: భీమిలి నియోజకవర్గం ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వినతులు స్వీకరించారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. మధురవాడ జోన్ 8 వ వార్డు పరిధిలోని గుడ్లవానిపాలెం, సాగర్ నగర్, సుభాష్ నగర్, రాజీవ్ నగర్ లలో రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టులు నిర్మించాలని.. 5 వ వార్డు సాయిరాం కాలనీ, శారదానగర్ లలో గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. మారికవలస శివాలయం రోడ్డు మీదకు వస్తున్న మురుగునీరు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, కొమ్మాది సర్వే నెంబర్ 27 లో రజకులకు దోభీ ఘాట్ నిర్మించాలని కోరారు. ఆనందపురం మండలం బోని నుంచి ముకుందపురం చెరువు మీదుగా రోడ్డు నిర్మించాలని విన్నవించారు. మధురవాడ, భీమిలి జోన్ల నుంచి, భీమిలి రూరల్, ఆనందపురం, పద్మనాభం మండలాల నుంచి ప్రజలు తెలియజేసిన సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని గంటా ఆదేశించారు. కూటమి నేతలు చిక్కాల విజయ్ బాబు, నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.