పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నయారా ఎనర్జీ
లీటరు పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3
దిల్లీ: నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసింది. లీటరు పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3 చొప్పున పెంచింది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ ఆధారంగా ఈ పెంపు వర్తిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పెంపు గరిష్ఠంగా రూ.5.30 వరకు ఉంటుంది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా పెట్రోల్ పంపులు ఉండగా.. రష్యా చమురు సంస్థ అయిన రాస్నెఫ్ట్కు చెందిన నయారా ఎనర్జీ 6,967 పెట్రోల్ పంపులను ఆపరేట్ చేస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
మరో ప్రముఖ ప్రైవేటురంగ చమురు సంస్థ రిలయన్స్-బీపీ మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. దేశవ్యాప్తంగా 2,185 ఔట్లెట్లను జియో-బీపీ నిర్వహిస్తోంది. సుమారు 90 శాతం మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వరంగ చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మాత్రం సాధారణ పెట్రోల్, డీజల్ ధరల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. ప్రీమియం పెట్రోల్ ధరను మాత్రం రూ.2.30 మేరకు ఇటీవల సవరించాయి. ఇండస్ట్రియల్ డీజిల్ను లీటరుకు రూ.22 చొప్పున పెంచాయి.