విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్ పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనా దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగింది. జిల్లాలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతులు వేగవంతం చేసి, పెట్టుబడిదారులకు సహకారం అందించాలని చెప్పారు.
ఎంఎస్ఎంఈ నానో పార్కుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎం.ఓ.యు.ల అమలు స్థితి, పెట్టుబడుల ప్రగతిని తెలియజేసే ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్పై పర్యవేక్షణ మరింత పెరగాలని సూచించారు. అలాగే ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమల శాఖ జీఎం ఆదిశేషు, ఏపీఐఐసీ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.