లాటరీ ప్రక్రియను పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి
విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్ విశాఖపట్నం డివిజన్ పరిధిలోని నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్సుల ఎంపిక ప్రక్రియను సోమవారం పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించారు. లాటరీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి స్వయంగా పర్యవేక్షించారు. డివిజన్ పరిధిలో మొత్తం 52 నోటిఫైడ్ బార్లకు గాను 27 బార్లకు దరఖాస్తులు అందాయని వాటిలో మూడు బార్లకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు రాగా, మిగిలిన బార్లకు సింగిల్ అప్లికెంట్లు మాత్రమే ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. బహుల దరఖాస్తులు వచ్చిన బార్లకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడంతో పాటు, ప్రతి బార్కు ఆర్1, ఆర్2 రిజర్వ్ అభ్యర్థులను కూడా ఖరారు చేశామన్నారు. డ్రాలో ఎంపికైన అభ్యర్థులు రూ.18.5 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. డిపాజిట్ చెల్లించిన వెంటనే ప్రొవిజనల్ లైసెన్స్ జారీ చేసి, తక్షణమే వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. పూర్తి లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పించగా, రెండు, మూడో సంవత్సరాల్లో లైసెన్స్ ఫీజుపై ఏటా 10 శాతం పెంపు ఉంటుందని పేర్కొన్నారు. లైసెన్స్ పొందిన వారు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, చట్టాలకు కట్టుబడి, నిర్ణీత ప్రాంగణాల్లోనే వ్యాపారం నిర్వహించాల్సి ఉంటుందన్నారు. విక్రయాలు, నిబంధనల అమలుపై నిశిత పర్యవేక్షణ చేపడతామని, ఉల్లంఘనలు జరిగితే కఠినమైన శాఖాపరమైన చర్యలు తప్పవని జేసీ ఈ సందర్భంగా హెచ్చరించారు.
కార్యక్రమంలో ఎక్సైజ్ డీసీ రామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ఆర్. ప్రసాద్, ఇతర అధికారులు, ఆశావహులు పాల్గొన్నారు.