జిల్లాలో పదవ తరగతి, ఓపెన్ స్కూల్ పదవ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయ కిృష్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 16 వ తేది నుండి మార్చి 29 వ తేది వరకు జిల్లాలో 102 పరీక్ష కేంద్రాలలో ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు 20,577 మంది, ప్రయివేట్ విద్యార్థులు 440 మంది మొత్తం 21,017 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.
జిల్లాలో ఓపెన్ స్కూల్ పదవ తరగతి పరీక్షలను మార్చి నెల 16వ తేదీ నుంచి ఏప్రియల్ నెల 1 వ తేదీ వరకు ఉదయం 09:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 71 ఓపెన్ స్కూల్ పదవ తరగతి కి చెందిన 531 మంది విద్యార్థులు జిల్లాలో 102 పరీక్ష కేంద్రాలలో పరీక్షలను రాయనున్నారని మరియు జిల్లాలో 38 ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ కి చెందిన 1398 మంది విద్యార్థులుకు గాను జిల్లాలో 6 పరీక్ష కేంద్రాలలో మార్చి 2వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.