ప్రమాదాలకు పిలుపు.. ఈ మలుపు...
తరచుగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు
భయాందోళనలో వాహనదారులు
సూచిక బోర్డు పెట్టాలని స్థానికుల మనవి
516 ఈ జాతీయ రహదారి మండలంలోని అంత్రిగుడ మలుపు తరచు ప్రమాదాలతో ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతో వాహనదారులు ప్రయాణికులు భయంతో గురవుతున్నారు. తరచుగా ఈ మలుపు వద్ద ద్విచక్ర వాహనాలు కానీ, కార్లు యాక్సిడెంట్లకు గురవుతున్నాయి. గత నెల 24న రెండు ద్విచక్ర వాహనాలు అదే మలుపు వద్ద ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరొక యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతోపాటు గతంలో జరిగిన పలు యాక్సిడెంట్లలో పలువురు చనిపోయి ఉన్నారు. తాజాగా శుక్రవారం రెండు ద్విచక్ర వాహనాలు అదే మలుపు వద్ద ప్రమాదవశాత్తు కొట్టడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని వైద్య చికిత్సల నిమిత్తం 108 అంబులెన్స్ లో అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా అక్కడ తరచుగా ప్రమాదాలు జరిగి మృత్యువాత చెందుతున్న ప్రమాదాల నివారణకు ఏ అధికారులు కూడా పట్టి పట్టనట్లు వ్యవహరించడం విచారకరమని స్థానిక గిరిజనులతో పాటు పర్యాటకులు పలువురు అంటున్నారు. అరకులోయ పర్యాటక ప్రాంతంలో ప్రముఖ పర్యాటక ప్రాంతం చాపరాయి జలపాతం సమీపంలో ఉండడంతో అరకులోయ సందర్శించిన పర్యాటకులు అధిక సంఖ్యలో చాపరాయి జలపాతంలో తిలకించడానికి వస్తున్నారు. దీంతో ఈ జాతీయ రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. కాగా ప్రమాదాల నివారణకు అక్కడ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అంత్రిగుడ మలుపు వద్ద ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులతో పాటు పర్యాటకులు, వాహనదారులు ప్రయాణికులు, పలువురు కోరుతున్నారు.