దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైళ్ల కారిడార్ ప్రతిపాదనను బడ్జెట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల గుండా మూడు కారిడార్లు ప్రకటించింది.ఇక హైదరాబాద్ టూ బెంగళూరు, హైదరాబాద్ టూ చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లనున్నాయి. బెంగళూరు, చెన్నై వెళ్లే కారిడార్లు అమరావతి మీదుగా వెళ్లనుండగా.. చెన్నై-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్లనుంది. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ల రాకతో భవిష్యత్తుల్లో ఏపీ రూపులేఖలు మారనున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతికి కనెక్టివిటీ మరింత పెరగనుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక ప్రతిపాదన చేశారు. బెంగళూరు-చెన్నై హైస్పీడ్ కారిడార్కు సంబంధించి చిత్తూరు-తిరుపతి మధ్య 75 కిలోమీటర్ల వ్యూహత్మక కనెక్టివిటీ ఇవ్వాలని సూచించారు.
చిత్తూరు మీదుగా బుల్లెట్ ట్రైన్
చిత్తూరు-తిరుపతి మధ్య కనెక్టివిటీ ఇస్తే అది బెంగళూరు-అమరావతి కారిడార్కు ఎంతో మేలు చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవకు చంద్రబాబు సూచించారు. దీని వల్ల అమరావతి, బెంగళూరు మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు. దీని వల్ల బెంగళూరు-అమరావతి మధ్య బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుంది. బెంగళూరు నుంచి చిత్తూరు మీదుగా అమరావతికి బుల్లెట్ రైలు నడవనుంది. దీని వల్ల అమరావతికి రెండు బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వచ్చినట్లు ఉంటుంది. చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం కూడా ఓకే చెప్పే అవకాశముందని తెలుస్తోంది. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళ్లనుంది. దీంతో హైదరాబాద్ నుంచి అమరావతికి గంటలోపే చేరుకోవచ్చు. ఇక చెన్నైకు 2.55 గంటల్లోనే చేరుకోవచ్చు.