ఇండియన్ గ్యాస్ సరఫరాలో
వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు.
గొలుగొండ, దివ్యదర్శిని
గొలుగొండ మండలంలో ఇండియన్ గ్యాస్ సరఫరా నిర్వహిస్తున్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సప్లై దారులపై వినియోగదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేని ప్రజలను లక్ష్యంగా చేసుకుని వారి వద్ద నుంచి ఓటీపీలు సేకరించి, అసలు వినియోగదారులకు సిలిండర్లు అందించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినియోగదారుల పేర్లపై బుకింగ్ చేసిన గ్యాస్ సిలిండర్లను వారి అనుమతి లేకుండానే డెలివరీ అయినట్లు చూపించి, ఆ సిలిండర్లను హోటళ్లకు లేదా ఇతర వ్యాపార అవసరాలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చర్యల వల్ల సాధారణ కుటుంబాలకు గ్యాస్ అందక రోజులు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు మహిళలు వాపోతున్నారు.
కొంతమంది వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లకు వచ్చిన ఓటీపీని “డెలివరీ ప్రక్రియ కోసం” అని చెప్పి తీసుకుని, ఆ తర్వాత సిలిండర్ తమకు అందకపోయినా డెలివరీ పూర్తయినట్లు మెసేజ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో నిజమైన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, మళ్లీ కొత్త బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. బొలెరో వాహనంపై గ్యాస్ సప్లై చేసే నిర్వాహకులు మాత్రం కస్టమర్లను చీదరించుకుంటూ అభ్యంతరకర సమాధానం చెబుతూ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఈ వ్యవహారంపై సంబంధిత ఆయిల్ కంపెనీ అధికారులు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్యాస్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, వినియోగదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు....