అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసి నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై బహుజన టీచర్స్ అసోసియేషన్ (బి.టి.ఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆదివాసి నిరుద్యోగులు చేపట్టిన ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
భారత రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు కల్పించి ఉన్నప్పటికీ, వాటిని పూర్తిగా కాలరాస్తున్న ప్రభుత్వ విధానాల వల్ల ఆదివాసి యువత తీవ్రంగా నష్టపోతున్నారని బి.టి.ఏ నాయకులు మండిపడ్డారు.
గతంలో ఆదివాసి ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాల్లో 100 శాతం ఉద్యోగాలు స్థానిక ఆదివాసులకే కేటాయించేవారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ హక్కును కుదించి కేవలం 6 శాతం మాత్రమే వర్తింపజేయడం తీవ్ర అన్యాయమని వారు పేర్కొన్నారు.
జీవో నెంబర్–3 రద్దుతో ఆదివాసుల మనుగడకే ప్రమాదం
ఆదివాసులు ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో జీవో నెంబర్–3 రద్దు చేయడం వల్ల వారి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిందని బి.టి.ఏ ఆవేదన వ్యక్తం చేసింది.
ఉద్యోగ అవకాశాలు లేక ఆదివాసి ప్రాంతాల్లోని విద్యార్థులు, యువత గ్రామాల్లోనే కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీని వల్ల ఆదివాసుల సమగ్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోందని తెలిపారు.