ఆకస్మిక తనిఖీలో లోపాలు గుర్తించిన పీఓ తిరుమణి శ్రీ పూజ
హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు – ఉపాధ్యాయులకు కఠిన హెచ్చరికలు
దివ్య దర్శిని న్యూస్ అల్లూరి జిల్లా/ముంచంగిపుట్టు, ఫిబ్రవరి 12:
మండలంలోని బంగారుమెట్ట జీటీడబ్ల్యూఏ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యా నిర్వహణలో తీవ్ర లోపాలు వెలుగుచూశాయి. గురువారం పీఓ మరియు జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమణి శ్రీ పూజ ఆకస్మికంగా పాఠశాలను సందర్శించి సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల పనితీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పాఠశాలకు చేరుకున్న వెంటనే తరగతి గదులను పరిశీలించిన పీఓ, విద్యార్థినులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, అందుతున్న సౌకర్యాలు, బోధన స్థాయి వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులు పాఠాలు సరిగా అర్థం కావడం లేదని, బోధన సమర్థవంతంగా సాగడం లేదని వెల్లడించడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యా ప్రమాణాలను పాటించడంలో వైఫల్యం, పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో ప్రధానోపాధ్యాయుడిపై తక్షణ సస్పెన్షన్ చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా ఉపాధ్యాయులను తీవ్రంగా మందలించిన ఆమె, బోధనలో అలసత్వం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపైనే ఉందని, పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించకపోతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆశ్రమ పాఠశాలలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు పరిపాలన కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని పీఓ వెల్లడించారు.
ఈ సంఘటనతో ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.